పరిశోధనా నివేదికను రూపొందించటం ఎలా?

by Disha edit |
పరిశోధనా నివేదికను రూపొందించటం ఎలా?
X

సామాజిక శాస్త్రాల పరిశోధన చివరిదశలో రీసెర్చ్ రిపోర్ట్‌ను తయారుచేస్తారు. ఇది అత్యంత ముఖ్యమైన ఘట్టం. దీని ద్వారా ఒక పరిశోధకుడు తాను చేపట్టే పరిశోధనా అంశం ప్రాముఖ్యతను, పరిశోధనా పద్ధతులను, పరిశోధన ఫలితాలను ఒక నివేదిక రూపంలో అందించాలి. దాంతోనే పరిశోధన శక్తి, సామర్థ్యాలు సమాజానికి తెలుస్తాయి. ఈ పరిశోధనా నివేదికను రూపొందించడం ఒక 'కళ'గా పరిశోధకులు భావిస్తారు. ఇవి రెండు రకాలు. మౌఖిక పద్ధతి, లిఖిత పద్ధతి.

మౌఖిక పద్ధతి ద్వారా లిఖిత పత్రాల సంక్షిప్త వివరణలతో పాటు అందిస్తారు. కొన్నిసార్లు ఇది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. దీనికి ప్రధాన కారణం లిఖిత రూపంలో సిద్ధాంత వ్యాసం ఎక్కువ పేజీల్లో ఉంటుంది. అది చదివి ఆకళింపు చేసుకోవడం కష్టం. అందువల్ల పరిశోధనా ఫలితాలను అతి తక్కువ సమయంలో, సంక్షిప్తంగా, సమర్థవంతంగా వివరించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. దీనిని వివరించడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, గ్రాఫ్, చార్ట్‌ల ద్వారా ఆకర్షణీయంగా ఉన్నతశ్రేణి అధికారులకు థీసిస్ అప్రూవల్ కమిటీకి వివరిస్తారు.

లిఖిత రూపంలో ఉన్న రిసెర్చ్ రిపోర్ట్‌లో పరిశోధకుడు తాను చేపట్టిన పరిశోధన పద్ధతులను వెల్లడైన పరిశోధనా ఫలితాలను సంక్షిప్తంగా ఐదు, ఆరు పేజీల్లో స్పష్టంగా, సరళంగా అందరికీ అర్థం అయ్యేలా వివరించాలి. ఇది రెండు రకాలు. సామాన్య ప్రజల కోసం, దిన పత్రికల ద్వారా వెల్లడి చేయడానికి గణాంకాలు, సాంకేతిక పదాలు నివారించి సరళ భాషలో అందరికీ అర్థం అయ్యేలా ఫలితాలు వెల్లడించాలి. ప్రత్యేక పరిశోధనా నివేదికలో ఎలాంటి పదభాష వాడి.. మ్యాపులు, చార్టులు, గ్రాఫ్‌లు ఉన్నా పరవాలేదు. వారికి అర్థం అవుతుంది. ఇందులో ప్రధానంగా ఉండాల్సిన విషయాలు. పరిశోధన అంశం, పరిశోధనా శీర్షిక, దాని స్వారూప స్వభావం వివరణ. అలాగే పరిశోధన కోసం అనుసరించే పద్ధతులు, దత్తాంశ సేకరణ పద్ధతులు, డేటా విశ్లేషణ కోసం అనుసరించిన ప్రామాణికత వివరాలు, సేకరించిన డేటా అంతర్గత సంబంధాల వివరణ, ఫలితాన్ని సంక్షిప్తంగా, సూటిగా ఐదారు పేజీల్లో వివరించడం. అలాగే పరిశోధనలో దాగున్న పరిమితులు చెప్పడం, తర్వాత పరిశోధనా కాలంలో సేకరణ కోసం, ఆర్థిక, ఆరోగ్యపరమైన, సాంకేతికపరమైన ఇతర సమస్యలను క్లుప్తంగా వివరించాలి.

సిద్ధాంత వ్యాసంలో ముందు కావాల్సింది ధృవీకరణ పత్రం. ఇది పరిశోధకుని స్వంత ఫలితమనీ, గతంలోది కాదనీ స్వయంగా ధృవీకరించాలి. అలాగే పరిశోధనా పర్యవేక్షకుడు ఇది తన పర్యవేక్షణలో స్వయంగా రూపొందించాడని ధృవీకరిస్తూ గైడ్ ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. అలాగే పరిశోధనలో తనకు సహకరించి సలహాలు, సూచనలు ఇచ్చిన పర్యవేక్షకుడికీ, సీనియర్ ఫ్యాకల్టీకీ సంక్షిప్తంగా కృతజ్ఞతలు తెలపాలి. తర్వాత తొలిపలుకులుగా(preface) ఈ అంశం ఎంచుకోవటానికి తనకు కలిగిన ప్రేరణ కారణాలు, పరిశోధన లక్ష్యాలు, ప్రాముఖ్యత, అనుసరించిన మెథడాలజీ భావి పరిశోధకులకు సంక్షిప్తంగా చెప్పాలి. తర్వాత పరిశోధనా అంశాలను చాప్టర్లుగా హేతుబద్ధంగా, క్రమ పద్ధతిలో విభజించి ప్రధాన శీర్షికలు, ఉపశీర్షికలు, టేబుల్స్, రేఖ చిత్రాలు, గ్రాఫ్ వంటివి పేజి నెంబర్లతో సహా స్పష్టంగా పేర్కొనాలి.

సిద్ధాంత వ్యాసం స్వరూపం మూడు భాగాలుగా ఉంటుంది అవి మొదటి భాగం, రెండు మధ్య భాగం, మూడు చివరి భాగం. ఇందులోని మొదటి భాగంలో మొదటగా పరిశోధన శీర్షిక, పరిశోధకుని పేరు, ఏ డిపార్టుమెంట్, ఏ డిగ్రీ కోసం, ఏ యూనివర్సిటీ కోసం సమర్పించిందో వివరణ ఉండాలి. అలాగే థీసిస్ సమర్పించిన తేదీ వివరాలు వెల్లడించాలి. సిద్ధాంత గ్రంథంలో ఆరు భాగాలు ఉంటాయి. అందులో మొదటిది ఉపోద్ఘాతం, పరిశోధనా సమస్య ప్రకటన, పరిశోధనా పద్ధతి వివరణ, పరిశోధనా ఆధారాలు, అంతర్గత సూచనలు, ఉపసంహారం. మూడవ భాగం రిఫరెన్స్ మెటీరియల్. ఇవి రెండు రకాలు సెలక్ట్ బిబిలోగ్రఫీ, జనరల్ బిబిలోగ్రఫీ. మొదటి దాంట్లో పరిశోధన కోసం ఉపయోగించిన గ్రంథాలు, పుస్తకాలు, జర్నల్స్ వంటి వాటిని పొందుపరచాలి. రెండవ దాంట్లో ఈ అంశానికి సంబంధించిన విస్తృత సమాచారం కోసం పుస్తకాలు, వ్యాసాలు ప్రచురించిన జర్నల్స్, ఇండెక్స్‌లు, ఎన్సైక్లోపీడియాలు పేర్కొనాలి. నాల్గవ భాగం అనుబంధాలు. ఇందులో గణాంక పట్టికలు, పటాలు, ఛాయాచిత్రాలు, ప్రశ్నావళులు, ఇంటర్వ్యూ షెడ్యూల్స్ మొదలైనవి అవసరాన్ని బట్టి అనుబంధం-1, అనుబంధం-2 మొదలైనవి పేజీల నంబర్లతో ఇవ్వాలి. ఐదవ భాగం ఉపయుక్త గ్రంథ సూచీ. దీన్ని రాయడంలో వివిధ పద్ధతులు వున్నాయి. అయితే పరిశోధకులు మాత్రం మోడ్రన్ లాంగ్వేజి అసోషియేషన్ (ఎంఎల్ఏ) స్టైల్ షీట్ సూచించిన పద్ధతినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆరవ భాగం ఫుట్ నోట్స్. ఇందులో రచయిత పేరు, ఇంటిపేరు, ప్రచురణ స్థలం, కాలం సంపాదకుడు/అనువాదకుని పేరు, ప్రచురణ కర్త, ముద్రణ, సంచికల సంఖ్య, ప్రచురణ స్థలం, ప్రచురణ కాలం, ఉటంకించిన పుటల సంఖ్య మొదలైన వివరాలను పొందుపరచాలి.

అత్యుత్తమ పరిశోధనా నివేదిక లక్షణాలు పరిశోధకుడు తాను సేకరించిన సమాచారంపై అధికారం కలిగి ఉండటం, సమయానుకూలంగా బలమైన సాక్ష్యాధారాలను ఉటంకిస్తూ తన సిద్ధాంత వ్యాసాన్ని రాయాలి. తగిన సాక్షాధారాలు లేకపోతే దీనిని సాధారణ రచనగా పిలుస్తాము కానీ పరిశోధనా సిద్ధాంత వ్యాసంగా పరిగణించరు. అలాగే పరిశోధన యాంత్రికంగా ఉండకూడదు. పరిశోధకుని సూక్ష్మ బుద్ధికుశలతపై నిరంతర అన్వేషణ వివేచనకు అది గుర్తుగా ఉండాలి. పరిశోధన గ్రంథం రాస్తున్న ప్రతి దశలో అప్రమత్తత కలిగిఉండి భాషా దోషాలు, పునరుక్తులు నివారించాలి. భావం, భాష, ఆధారాలు క్రమపద్ధతిలో ఆర్గానిక్ యూనిటీతో హేతుబద్ధంగా రచన కదం తొక్కాలి. తన గ్రంథంలో సాధ్యమైనంత వరకు సొంత అభిప్రాయాలు, నమ్మకాలు, విశ్వాసాలు ప్రతిబింబించకుండా చూడాలి. అన్వేషణ ఫలితాలను నిష్పాక్షికంగా వెల్లడించాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఉత్తమ పరిశోధనా రచనగా సిద్ధాంత గ్రంథం వాసికెక్కుతుంది.

డాక్టర్.రాధికా రాణి,

అసిస్టెంట్ ప్రొఫెసర్, కేయూ

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

ఖనిజ సంపద కోసం జీవితాల్లో నిప్పులు..


Next Story